Text Size

20240324 ఒక టాక్ షో: శ్రీల ప్రభుపాదతో మీ సంబంధాన్ని మరింత బలపరుచుకోవడం

24 Mar 2024|Duration: 00:43:12||Prabhupāda Kathā|Śrī Māyāpur, India

ఈ క్రిందిది పరమ పూజ్య జయపతాకా స్వామి మహారాజు గారు 2024 మార్చి 24వ తేదీన భారతదేశంలోని శ్రీ ధామ మాయాపూర్‌లో ఇచ్చిన ప్రసంగం. ఈ ప్రసంగాన్ని 'కనెక్టింగ్ టు శ్రీల ప్రభుపాద బెంగాలీ ప్రోగ్రామ్'లో ఇచ్చారు.

మూకం కరోతి వాచలం పంగుం లంగయతే గిరిం
యత్-కృపా తమ్ అహం వందే శ్రీ-గురుం దీన-తారణం 
పరమానందం మాధవ్ చతరణం

Hariḥ oṁ tat sat!

జయపతాకా స్వామి : నేను కెనడాలోని మాంట్రియల్, టొరంటో మరియు ఇతర ప్రదేశాలలో అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ తర్వాత శ్రీల ప్రభుపాద నన్ను భారతదేశానికి పంపారు. భారతదేశానికి ప్రయాణించడానికి నేను బ్రదర్స్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించాను. వారు ముగ్గురు సోదరులు, ఆ ఎయిర్‌లైన్స్‌కు వారి పేర్ల మీదుగా పేరు పెట్టారు. ఆ విమానం రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి ప్రొపెల్లర్ విమానం. ఆ విమానం ఎక్కువ దూరం, ఎక్కువ సేపు ప్రయాణించలేదు. మేము బ్రస్సెల్స్ నుండి రోమ్‌కు, రోమ్ నుండి కైరోకు, కైరో నుండి యెమెన్‌కు, యెమెన్ నుండి కరాచీకి మరియు కరాచీ నుండి బొంబాయికి ప్రయాణించాము. నేను బొంబాయి చేరుకున్నప్పుడు అక్కడ పెద్దగా భద్రతా ఆంక్షలు లేవు. ఒక మహిళ భిక్షాటన చేస్తూ, తన బిడ్డతో ఉంది. ఆమె నన్ను 'బక్షిష్! బక్షిష్!' అని అడిగింది. అక్కడ నా దగ్గర ఒక ఫోన్ నంబర్ ఉండటంతో దానికి కాల్ చేశాను. కానీ ఎటువంటి స్పందన రాలేదు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, మీరు కరెన్సీ మార్చుకోవాలనుకుంటే నేను మీకు మంచి రేటు ఇవ్వగలను అన్నాడు. పరిస్థితి అంత బాగాలేదని నాకు అర్థమైంది, నేను అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. ఆ తర్వాత నేను కలకత్తాకు వెళ్ళాను. చైతన్య గౌడీయ మఠానికి టాక్సీలో వెళ్ళాను. మాయాపురానికి రాకముందు కొన్ని నెలల పాటు నేను ఆ చైతన్య గౌడీయ మఠంలో ఉన్నాను. అప్పుడు శ్రీల ప్రభుపాద జపాన్ నుండి అక్కడికి రావాలనుకున్నారు, కానీ అప్పటికి కలకత్తాలో మాకు సొంత ఇల్లు ఉండాలని ఆయన కోరుకున్నారు. కలకత్తాలో ఒక డాక్టర్ ఉండేవారు, ఆయన తన కొత్త క్లినిక్‌ను కొన్ని నెలలు ఉండటానికి మాకు ఇచ్చారు , మేము అక్కడే ఉన్నాము, ఆ తర్వాత శ్రీల ప్రభుపాద వచ్చారు.

శ్రీల ప్రభుపాద కలకత్తాకు వచ్చినప్పుడు, ఆయనకు స్వాగతం పలకడానికి నేను గౌడీయ మఠాలను ఆహ్వానించాను, కానీ ఎవరూ రాలేదు. శ్రీల ప్రభుపాద యొక్క గురుసోదరులెవరూ రాలేదు, కేవలం కొంతమంది బ్రహ్మచారులు మాత్రమే వచ్చారు . వారు ఆయన్ని గౌడీయ మఠానికి తీసుకువెళ్తామని చెప్పారు. కానీ శ్రీల ప్రభుపాద, “వద్దు, నేను మా ఊరికే వెళ్తాను,” అన్నారు. ఆయన మఠం నుండి ప్రసాదం స్వీకరించడానికి కొంతమంది భక్తులను పంపుతానని చెప్పారు. గురుసోదరుల మధ్య జరిగే ఈ రకమైన సంభాషణ అంతా నాకు అర్థం కాలేదు. శ్రీల ప్రభుపాద ఇలా అన్నారు, “వారు నా దగ్గరకు వచ్చి ఉంటే బాగుండేది, కానీ వారు నన్ను వారి గౌడీయ మఠానికి వెళ్ళమని కోరారు.” శ్రీల ప్రభుపాద ఇలా అన్నారు, “నేను అక్కడికి వెళ్తాను, పశ్చిమ దేశాలలో నేను చేసిన ప్రచారానికి వారే ఘనతను తీసుకుంటారు.” ఇది నాకు అర్థం కాలేదు కానీ శ్రీల ప్రభుపాదకు అర్థమైంది. మేము కలకత్తాలో రెండు సంవత్సరాలు ఉన్నాము. ఆ తర్వాత శ్రీల ప్రభుపాద నన్ను మాయాపూర్‌కు పంపారు. అప్పటి నుండి నేను మాయాపూర్‌లోనే ఉన్నాను.

మేము మాయాపూర్‌లో అమనా షేక్ అనే వ్యక్తి నుండి కొంత భూమిని కొనుగోలు చేశాము. అప్పుడు ఒక బీఘా భూమి ధర రూ.1100 ఉండేది. బసేర్ బాడీ అనే ప్రదేశంలో ఒక బీఘా ధర రూ.500 ఉండేది, అక్కడ కూడా మేము ఒకరి నుండి భూమిని కొనుగోలు చేశాము. అమెరికాలో శ్రీల ప్రభుపాద 'వ్యవస్థాపక-ఆచార్య' అనే పేరును స్థాపించారని , మరియు తన కార్యదర్శులలో ఒకరు కొంత భూమిని తన పేరు మీదకు మార్చుకుని అమ్ముకున్నారని విన్నందున శ్రీల ప్రభుపాద స్వయంగా ఆ పేరును పెట్టుకున్నారని నేను విన్నాను. ఈ విధంగా, పశ్చిమ దేశాలలో శ్రీల ప్రభుపాద చేసిన ప్రచార కార్యక్రమాలకు ఆయన గురు సహోదరులలో కొందరు కీర్తిని పొందాలని చూశారు. శ్రీల ప్రభుపాద తన హక్కు కోసం ఈ 'వ్యవస్థాపక-ఆచార్య' అనే పేరును స్థాపించారు. ఇస్కాన్ భక్తులందరికీ తనతో ఒక ప్రత్యేకమైన సంబంధం లేదా అనుబంధం ఉండాలని శ్రీల ప్రభుపాద కోరుకున్నారు. ఆ విధంగా, ఇస్కాన్ యొక్క ప్రతి ఆలయంలో శ్రీల ప్రభుపాద విగ్రహం ఉండేది. మరియు ప్రతిరోజూ శ్రీల ప్రభుపాద గురుపూజ నిర్వహించబడేది.

ప్రతి రాత్రి మాయాపూర్‌లోని శ్రీల ప్రభుపాదుల వ్యాసాసనానికి ఒక కుక్క వచ్చేది . మరియు ప్రతి రాత్రి మాకు మరమరాల ప్రసాదం లభించేది . మేము రాత్రి భోజన ప్రసాదంగా మరమరాలు, పాలు తీసుకునేవాళ్ళం మరియు భక్తులు విశ్రాంతి తీసుకునేవారు. నేను జాలీ తలుపు వెనుక దాక్కుని కుక్క వస్తుందో లేదో చూశాను. నేను ఆ కుక్కను చూశాను. అది శ్రీల ప్రభుపాదుల వ్యాసాసనం ముందుకి వచ్చి సంపూర్ణ నమస్కారాలు చేసింది. హరిబోల్!

అతుల కృష్ణ దాస : శ్రీల ప్రభుపాదులు మాయాపురానికి వచ్చినప్పుడల్లా మీరు అక్కడే ఉండేవారు. అప్పుడు మీరు శ్రీల ప్రభుపాదుల నుండి విన్న ఏవైనా ప్రత్యేక లీలలు లేదా ఉపదేశాలను మాతో పంచుకోగలరా?

జయపతాకా స్వామి : కొన్ని రోజులు శ్రీల ప్రభుపాద మాయాపురానికి వచ్చి చక్కగా మాట్లాడేవారు. ఆ తర్వాత నాలుగైదు రోజులకు ఆయన క్రమంగా అన్ని లోపాలను చూసి ఎత్తి చూపేవారు. " ఈ కుండ ఎందుకు మురికిగా ఉంది?" అని అడిగేవారు. మాయాపురం ఆధ్యాత్మిక కేంద్రం, అందువల్ల ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలి అని శ్రీల ప్రభుపాద చెప్పేవారు. శ్రీల ప్రభుపాద లోటస్ బిల్డింగ్‌లో బస చేసేవారు. ఉదయాన్నే ఆయన నడకకు వెళ్ళేవారు. ఆయనకు ఏమైనా మురికి కనిపిస్తే, మాకు తెలియజేసేవారు. లోటస్ బిల్డింగ్‌లోని మూడవ అంతస్తులో శ్రీల ప్రభుపాద బస చేయగా, బ్రహ్మచారులు నాలుగవ అంతస్తులో ఉండేవారు. బ్రహ్మచారులు కొంచెం అపరిశుభ్రంగా ఉండేవారు మరియు వారు ఉండే చోట మురికి ఉండేది. బ్రహ్మచారులు అక్కడ ఒక గోడపై  తమ బట్టలు ఆరబెట్టుకునేవారు. ఒక రోజు శ్రీల ప్రభుపాద బ్రహ్మచారుల అంతస్తుకు వెళ్లారు . అక్కడ ఒక బట్టల తాడు ఉంది . ఆ బట్టల తాడు వల్ల భవనం పాడవుతున్నందున, బ్రహ్మచారులు మన భవనాన్ని పాడు చేస్తున్నారని ఆయన అన్నారు . అప్పుడు మన చక్ర భవనం సిద్ధమైంది. ఆయన బ్రహ్మచారులను చక్ర భవనానికి పంపారు . ఈ విధంగా, మాయాపురాన్ని ఎలా చక్కగా, శుభ్రంగా ఉంచుకోవాలో శ్రీల ప్రభుపాద సలహాలు ఇచ్చేవారు.

అతుల కృష్ణ దాస : భవిష్యత్తులో మహర్షి శిష్యులు మరియు ఇతర భక్తులు శ్రీల ప్రభుపాదుల సాంగత్యాన్ని ఎలా పొందుతారు? 

జయపతాకా స్వామి : శ్రీల ప్రభుపాదుల సాంగత్యం చేసే భాగ్యం మాకు కలిగింది. అప్పుడు నాకు బెంగాలీ కొద్దిగా అర్థమయ్యేది. గౌడీయ మఠం నుండి ఒక మహారాజు, తమ గురువుగారి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి శ్రీల ప్రభుపాదులను ఆహ్వానించడానికి వచ్చారు. శ్రీల ప్రభుపాదులు బెంగాలీలో మాట్లాడేవారు, అది నాకు అర్థమయ్యేది. ఆయన అన్నారు, "నేను వెళితే ఒక్కటే చెబుతాను. మనం ఎందుకు ఐక్యంగా ప్రచారం చేయడం లేదు? ఈ విషయాన్ని మీరు పదే పదే వినాలి. మాతో కలిసి ప్రచారం చేయడానికి మీరు ఎందుకు ఇష్టపడటం లేదు?" దానికి ఆ మహారాజు, "మేము చిన్న చెరువులోని చిన్న చేపలం. మీరు పెద్ద చేపలు , మీతో మేము నెట్టుకురాలేము" అని అన్నారు. శ్రీల ప్రభుపాదులు చాలా నిరాశ చెందారు. అప్పుడు ఆ మహారాజు వెళ్ళిపోయారు. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి అనేక పుస్తకాలు, ఉపన్యాసాలు, లేఖలు ఉన్నాయి. మీరందరూ వాటిని చదివితే శ్రీల ప్రభుపాదుల వారి ఆలోచనలను, మనోభావాలను అర్థం చేసుకోగలరు. మరియు శ్రీల ప్రభుపాదులు శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూర్ వారి ఆజ్ఞలను పాటించారు. ఏదైనా లోపం ఉందంటే, అది కేవలం తన ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనలను అక్షరాలా పాటించడమేనని ఆయన అన్నారు.

నేను వచ్చినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఎక్కువగా ఉండేవి కావు. ఆ తర్వాత క్రమంగా భగవద్గీత, శ్రీమద్భాగవతం ప్రచురించబడ్డాయి. ఇప్పుడు మీరందరూ వాటిని అధ్యయనం చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. ఆ తర్వాత, నాకు శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యం ఎక్కువగా లభించింది మరియు ఆయన నాకు సుమారు 40 సూచనలు ఇచ్చారు. నేను వాటన్నింటినీ నెరవేర్చగలనో లేదో నాకు కచ్చితంగా తెలియదు. ఇప్పుడు ఏవైనా మిగిలిపోతే, మీరు వాటిని పూర్తి చేయండి. శ్రీల ప్రభుపాదులు రెండు మూడు గంటలపాటు అనువాదం చేసేవారు, దానికోసం ఆయన ఎంతో శ్రమపడేవారు. కాబట్టి, శ్రీల ప్రభుపాదులు ఈ పుస్తకాలను వ్రాయడానికి ఎంతో శ్రమపడ్డారు కాబట్టి నేను కూడా ఆయన పుస్తకాలను అధ్యయనం చేయాలని అనుకున్నాను . ఇప్పుడు నేను నా భక్తివేదాంత పట్టాను పొందాను. నేను శ్రీమద్భాగవతాన్ని చాలా ఎక్కువగా అధ్యయనం చేశాను . శిష్యులందరూ, ఇతర భక్తులు శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా వారు శ్రీల ప్రభుపాదుల వారి ఆకాంక్షను నెరవేర్చగలుగుతారు. హరి శౌరి ప్రభు మరియు ఇతర భక్తులు చరిత్రను రచించారు. శ్రీల ప్రభుపాదుల వారి ఉపన్యాసాలు, వారి అనువాదాలు, ఇలా అనేకం ప్రచురించబడ్డాయి. ఈ విధంగా, ఇవన్నీ శ్రీల ప్రభుపాదులు మన కోసం వదిలివెళ్లిన అత్యంత అమూల్యమైన గ్రంథాలు. శ్రీల ప్రభుపాదులు మమ్మల్ని ప్రోత్సహించేవారు. నేను శ్రీల ప్రభుపాదుల వారికి రాళ్లు, ఉక్కు, ఇనుము మొదలైన వాటి చిత్రాలను పంపేవాడిని. దానికి శ్రీల ప్రభుపాదులు, "నువ్వు నాకు ఈ వస్తువుల చిత్రాలను చూపిస్తున్నావు, నేను ఆ కట్టడాన్ని చూడాలనుకుంటున్నాను!" అని బదులిచ్చేవారు. ఆ తర్వాత లోటస్, చక్ర, గద, శంఖ భవనాలు వచ్చాయి. శ్రీల ప్రభుపాద ప్రతి సంవత్సరం రెండుసార్లు మాయాపూర్‌కు వస్తుండేవారు కాబట్టి, మాకు ఆయన సాంగత్యం లభించేది.

- END OF TRANSCRIPTION -
Transcribed by Jayarāseśvarī devī dāsī
Verifyed by
Reviewed by

Lecture Suggetions